సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఉదయం నిజామాబాద్ రుద్రూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికే 60 శాతానికి పైగా ఖాళీ అయిన ఆ పార్టీ పూర్తిగా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వస్తుందని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రాజెక్టులకు అడ్డుపడకుండా ప్రజల బాగుకోసం ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా రాణపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎస్కే మహ్మద్, తన కార్యకర్తలతో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.